చంద్రబాబు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయిన ప్రధాని మోదీ

  • హైదరాబాదులో మోదీ పర్యటన
  • జూబ్లీహిల్స్ లో చంద్రబాబు నివాసానికి వెళ్లిన మోదీ
  • ప్రధానికి సాదర స్వాగతం పలికిన చంద్రబాబు, లోకేష్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాద్ పర్యటకు విచ్చేశారు. ఈ క్రమంలో, జూబ్లీహిల్స్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. తమ ఇంటికి వచ్చిన ప్రధానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ సాదర స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబుతో మోదీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు జరిగిన సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలపై చర్చించుకున్నారు.

ఈ భేటీలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలన, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. అదే సమయంలో, తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది.

ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీలక అంశాల నేపథ్యంలో ఈ భేటీ జరగడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

అంతకుముందు, ప్రధాని మోదీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గచ్చిబౌలిలో సింధు ఆసుపత్రిని ప్రారంభించారు. ఆసుపత్రి ప్రాంగణంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సింధు ఆసుపత్రిని పరిశీలించారు. 

Chandrababu Naidu
Narendra Modi
Andhra Pradesh
Telangana Politics
Nara Lokesh
Hyderabad Visit
AP Politics
Pawan Kalyan
Sindhu Hospital
Political Meeting

More Telugu News